రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ అనుబంధ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి - కందుకూరు ఎమ్మెల్యే

జనసాక్షి : జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ అనుబంధ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. శనివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు డ్వామా అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సమీక్షలో భాగంగా, డ్వామా కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకి అధికారులు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో చేసిన పనులు, పురోగతి వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాదిలో చేపట్టబోయే ప్రతిపాదనలను మండలాల వారీగా అధికారులు ఆయనకు వివరించారు. గత ప్రభుత్వంలో జలకళ ద్వారా, నియోజకవర్గం మొత్తంమీద 430 బోర్లు వేయగా కేవలం ఐదింటికి మాత్రమే మోటార్లు బిగించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లు లేకపోవడం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలవల్ల మోటార్లు బిగించడంలో జాప్యం జరిగిందని ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతావాటి గురించి ఆలోచిద్దామని తెలిపారు. ఉద్యానపంటల ఎంపిక, మొక్కల పంపిణీ, ప్రభుత్వ రాయితీలు తదితరుల అంశాలపైనా ఎమ్మెల్యే సమీక్షించారు. కార్యక్రమంలో డ్వామా APD మృదుల, ఐదు మండలాల APO లు, EC లు, TA లు, కంప్యూటర్, ఇంజనీరింగ్ సిబ్బంది హాజరయ్యారు.
What's Your Reaction?






