కందుకూరులో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి - ఎంపీ

కందుకూరులో స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయండి
- కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి వినతి
నెల్లూరు జనసాక్షి :కందుకూరులో సుమారు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఖాదీ కార్యాలయం శిధిలావస్థకు చేరిందని, దాని స్థానంలో ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కోసం స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గారు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యస్థ పరిశ్రమల శాఖమంత్రి జితన్ రామ్ మాంఝీని విన్నవించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి.. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో సత్కరించారు. అనంతరం వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, పేద చేనేత కార్మికుల స్వావలంబన లక్ష్యంతో సుమారు 50 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా గ్రామ స్వరాజ్య సంఘం పేరుతో కందుకూరులో ఖాదీ కార్యాలయం ఏర్పాటు అయిందన్నారు. అయితే తదనంతర పరిణామాల వల్ల సదరు భవనం నిర్వీర్యం అయి, నిరుపయోగంగా మారిందన్నారు. ఎలాంటి పునరుద్ధరణకు నోచుకోలేదని కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్ర ఖాదీ కార్యాలయం.. ఈ సంస్థను మరొక పొరుగు సంస్థకు అప్పగించడానికి ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఎంపీ.. కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పాత ఖాదీ కార్యాలయం స్థానంలో ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన కింద కందకూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
What's Your Reaction?






