అసెంబ్లీలో చర్చలను ప్రత్యేకంగా తిలకించిన కరేడు విద్యార్థులు
అసెంబ్లీలో చర్చలను ప్రత్యక్షంగా తిలకించిన విద్యార్థులు
పిల్లలకు అర్థమయ్యేలా అసెంబ్లీ కార్యక్రమాలను వివరించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు
అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉలవపాడు మండలంలోని కరేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దక్కింది. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆహ్వానంతో... ఉలవపాడు మండలం కరేడు హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న 28 మంది విద్యార్థులు, శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లారు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని, వ్యవసాయ రంగంపై జరుగుతున్న చర్చను సుమారు అరగంట సేపు ప్రత్యక్షంగా తిలకించారు. స్పీకర్ సభను నడిపిస్తున్న విధానం, మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం, సభ్యుల స్పందన, అక్కడి నియమాలను గమనించారు. అనంతరం విద్యార్థులంతా, అక్కడే ఉన్న కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని కలిశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రస్తావించే అంశాలు, సభ నిర్వహణ, ఇతర అంశాల గురించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తో కలిసి విద్యార్థులు గ్రూప్ ఫోటో దిగుతూ సందడి చేశారు. కరేడు హైస్కూల్ పీడీ పీ.శ్రీనివాసులు, సోషల్ టీచర్ పి.సుబ్బారావులు విద్యార్థులతో కలిసి ఈ పర్యటనలో పాల్గొన్నారు.
What's Your Reaction?