వైఎస్సార్ లా నేస్తం రెండో విడతలో 2,807 యువ న్యాయవాదులకు రూ. 8 కోట్లు ఆర్థిక సాయం

Dec 11, 2023 - 14:51
 0  51
వైఎస్సార్ లా నేస్తం రెండో విడతలో 2,807 యువ న్యాయవాదులకు రూ. 8 కోట్లు ఆర్థిక సాయం

-వైఎస్సార్ లా నేస్తం రెండో విడతలో 2,807 యువ న్యాయవాదులకు రూ. 8 కోట్లు ఆర్థిక సాయం

- బటన్ నొక్కి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 30 వేల చొప్పున జమ చేసిన సీఎం జగన్

జనసాక్షి : వైఎస్సార్ లా నేస్తం రెండో విడతలో 2,807 యువ న్యాయవాదులకు రూ. 8 కోట్ల ఆర్థిక సాయం సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన వైయస్సార్ లా నేస్తం రెండో విడత నిధులను నేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ 'వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైయస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నాం. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నాం. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నాం.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

రెండో విడతలో. 2,807 మంది యువ న్యాయవాదులకు లబ్ది

'వైఎస్సార్ లా నేస్తం రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఈరోజు మంచి చేస్తూ దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలో మొత్తంగా వైయస్సార్ లా నేస్తం ద్వారా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్ రూ.49.51 కోట్లు. ఇటువంటి అడ్వొకేట్లకు వాళ్ల ఇనీషియల్ స్టేజ్‌లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ల ప్రొఫెషన్‌లో వాళ్లు నిలదొక్కుకోవడం, తర్వాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుంది' అని అన్నారు.

రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసాం.. సీఎం జగన్

న్యాయవాదుల కోసం వైఎస్సార్ లా నేస్తంతో పాటు రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించామని సీఎం జగన్ అన్నారు. 'అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచుతూ రూ.100 కోట్లు కేటాయింపు చేశాం. ఆ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం తరఫున వేగంగా అడుగులు పడ్డాయి. 643 మందికి కోవిడ్ సమయంలో వీళ్ల కుటుంబాలకు రూ.52 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ 7,733 మందికి రూ.11.56 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది. మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద రూ.11.41 కోట్లు చెల్లించడం జరిగింది. రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి ఇచ్చి అడ్వొకేట్ కమ్యూనిటీకి తోడుగా నిలబడగలిగింది' అని సీఎం పేర్కొన్నారు.

పాదయాత్రలో ఇచ్చిన మాట నెరవేర్చాం

న్యాయవాదులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ ఇవన్నీ మనసు పెట్టి, మంచి జరగాలని మనసారా ఆలోచన చేసి చేయగలిగాం. నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. మాట ఇచ్చిన మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ అడుగులు వేయడం, ఈ నాలుగు సంవత్సరాలుగా చేయగలిగాం అని సంతోషంగా చెబుతున్నా. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్‌కు నా తరఫున ఒకే ఒక రిక్వెస్ట్. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, పేద వాడి పక్షాన మీరు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ, మంచి చేసే విషయంలో మానవతాదృక్ఫథం చూపించాల్సిందిగా ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తున్నా. దేవుడి దయతో మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం' అని అన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow