అర్హులకు పింఛన్లు మంజూరు చేయండి
- అసెంబ్లీలో పెన్షన్ల అందజేతపై మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
- గత ప్రభుత్వం అనర్హులను పింఛన్లు అందించింది
- అర్హులను గుర్తించి పింఛన్లు అందించాలని వినతి
కోవూరు నియోజకవర్గంలో పింఛన్లపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులు కొందరికి పింఛన్లు వస్తున్నాయని, వాటిని పరిశీలించి అర్హులకు పింఛన్లు అందేలా చూడాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం చాలామంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిందని, దాంతో అర్హులు తమ పింఛన్లు కోల్పోయారన్నారు. నిత్యం సచివాలయకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని, వాటిపై సచివాలయాల్లో స్పందన తక్కువగా ఉందన్నారు. కోవూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ ప్రశ్నలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సామాజిక భద్రత కింద ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించేందుకు కృషి చేస్తున్నామని సమాధానమిచ్చారు. అనర్హులకు పింఛన్లు అందించడంపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించామని, అనర్హులకు గుర్తించినట్లు చెప్పారు. తప్పకుండా అనర్హులకు పింఛన్లు తొలగించి అర్హులైన వారికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.