జిల్లాలో పెట్రోలు,డీజిల్ సమృద్ధిగా ఉన్నాయి - కలెక్టర్ రాజాబాబు
జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని, కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ లు, సరఫరాదారులు కృత్రిమ సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్పష్టం చేశారు.జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత పై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సంబంధిత శాఖల అధికారులు, ఆయిల్ కంపెనీల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెట్రోల్ , డీజిల్ వినియోగం, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, జిల్లాలో ఇంధన కొరత పై వస్తున్న ప్రచారం అవాస్తవమని, అపోహలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు భయాందళనకు గురై అవసరమైన దాని కంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పెట్రోల్ బంకులపై అలాగే బల్క్ కొనుగోలు, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పెట్రోల్ బంక్లపై తనిఖీలు చేపట్టడం, అవసరమైతే ప్రత్యేక బృందాలను నియమించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా లోని ఇంధన రిటైల్ అవుట్ లైట్లను తనిఖీ లు నిర్వహించి, ఎవరి వద్ద అయినా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు గుర్తిస్తే అటువంటి వారిపై వెంటనే కేసులు బుక్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అలాగే, జిల్లాలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేస్తూ, అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అపోహలకు లోనవకుండా అధికారిక సమాచారం మేరకు మాత్రమే విశ్వసించాలని, ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
What's Your Reaction?