పెళ్లి బృందానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
పెళ్లి బృందానికి తృటిలో తప్పిన ప్రమాదం!
-టైరు పగిలి సిమెంట్ దిమ్మెను ఢీకొన్న టెంపో.. ఆరుగురికి స్వల్ప గాయాలు
శిఖర జనసాక్షి, సింగరాయకొండ: తిరుమలకు పెళ్లి నిమిత్తం వెళ్తున్న పెళ్లి బృందానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టెంపో ముందు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పి రహదారి మధ్యలోని సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సింగరాయకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పోలేరమ్మ గుడి సమీపంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ వద్ద అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.కృష్ణాజిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామానికి చెందిన 11 మంది మచిలీపట్నం నుంచి టెంపోలో తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మార్గమధ్యంలో వాహనం ముందు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో టెంపో రహదారి మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపో ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు, హైవే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హైవే అంబులెన్స్, 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్కు తరలించారు.గాయపడిన వారిలో శ్రీను, శ్రీనివాసరావు, వరలక్ష్మి, శివపార్వతి, సోమేశ్వరరావు, రోహిత ఉన్నారు. పెళ్లికుమారుడు శ్రీనివాసరావుకు స్వల్ప రక్తగాయాలు కాగా, పెళ్లికుమార్తె రోహితకు స్వల్ప గాయాలయ్యాయి.ప్రమాద స్థలాన్ని సింగరాయకొండ ఎస్సై సుధీర్బాబు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
What's Your Reaction?